Headlines

22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!


22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని.. యవత్ ప్రపంచ గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఎందుకు చైనా ఇప్పుడు ఇంత బంగారం కొంటోందన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇది ఏదో ఒక్క నెల తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు చేస్తోందట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను ముందే పసిగట్టి తన ఖజానాను పటిష్టం చేసుకుంటోంది.

గత నెలలో చైనా కొన్న 6.5 లక్షల ఔన్సుల బంగారం.. 2023 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యధిక కొనుగోలుగా రికార్డుల్లోకెక్కింది. దీంతో ఆ దేశం వద్ద ఉన్న మొత్తం అధికారిక బంగారం నిల్వలు 7.67 కోట్ల ఔన్సులకు చేరాయి. సాధారణంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఆగుతారు. కానీ చైనా మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది.

అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతుండటమే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 72 శాతం ఉండేది. ఇప్పుడది దాదాపు 55 శాతానికి పడిపోయింది. డాలర్ క్రమంగా తన పట్టు కోల్పోతుండటంతో ఇతర దేశాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు వేగంగా దృష్టి పెడుతున్నాయి.

మార్కెట్ విలువ పరంగా చూస్తే 1990 తర్వాత అమెరికా ప్రభుత్వ బాండ్లను దాటి బంగారం మొదటి స్థానానికి చేరింది. భద్రత కోసం డాలర్ ఆస్తులపై ఆధారపడటం కంటే పసిడిని నిల్వ చేసుకోవడమే మేలని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి నిర్వహించిన సర్వేలోనూ ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సంక్షోభ సమయాల్లో రక్షణ కవచంలా పనిచేస్తుందనే నమ్మకంతో 90 శాతం బ్యాంకులు బంగారానికే జై కొడుతున్నాయి.

ఇంకో ఏడాదిలో తమ వద్ద ఉన్న పసిడి నిల్వలను మరింత పెంచుకుంటామని 45 శాతం కేంద్ర బ్యాంకులు స్పష్టం చేశాయి. ఇది కేవలం భయంతో చేస్తున్న పని కాదు. ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏవైనా ఆంక్షలు ఎదురైనా, ఆర్థిక మార్కెట్లు కుదేలైనా చిక్కులు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అమెరికా డాలర్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఇప్పటికీ కీలకంగా ఉన్న మాట వాస్తవమే. అయితే రిజర్వుల విషయంలో మాత్రం పసిడికి ఆదరణ నానాటికీ విస్తరిస్తోంది. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం చైనా మాత్రమే కాకుండా పలు ప్రధాన దేశాలు ఇదే బాటలో నడుస్తున్నాయి.

చైనా వరుసగా 22 నెలలు ఆగకుండా కొనుగోళ్లు సాగించడం సాధారణ అంశం కాదు. డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా దేశాలు భరోసాను వెతుక్కుంటున్నాయనే విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్ ఆర్థిక సంక్షోభాల నుంచి తప్పించుకునేందుకు బీజింగ్ తీసుకుంటున్న ఈ ముందస్తు రక్షణ చర్యలు ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *