ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పించన్లను మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పింఛన్లను కొనసాగించడంతో పాటు అనర్హులను గుర్తించి తొలగించింది. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా పలు సూచనలు జారీ చేసింది.’
కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..?
పెండింగ్లో ఉన్న పాత పెన్షన్ దరఖాస్తులను తొలగించారు. అయితే ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తుదారులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసేవారి ఆధార్ స్టేటస్, గత అప్లికేషన్ స్టేటస్ను అధికారులు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమోదం లభించిన వ్యక్తి పేరుతో మళ్లీ కొత్త దరఖాస్తు చేస్తే డూప్లికేట్ అప్లికేషన్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో దరఖాస్తు పరిశీలనలో అనవసరమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త దరఖాస్తులను స్వీకరించే ముందు ఆధార్ వివరాలను పరిశీలించడంతో పాట గత దరఖాస్తు స్టేటస్ పరిశీలించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఆమోదం పొంది ఉంటే కొత్తగా దరఖాస్తు చేయవద్దని సూచించింది. అటు కొత్త పెన్షన్ దరఖాస్తుకు ఇంటి పన్ను అసెస్మెంట్ నెంబర్ తప్పనిసరి కాదని ఏపీ సర్కార్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు అర్హత పరిశీలన జరగనుండగా.. ధృవీకరణ, ప్రభుత్వ ఆమోద ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. అనంతరం లబ్దిదారుల జాబితా సిద్దం చేసి కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది. ఏపీలో వృద్దులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తుండగా.. దివ్యాంగులు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పించన్ల సొమ్మును పెంచింది.