
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఒక అనుమానాస్పద కాల్ సెంటర్పై సైబర్ బ్యూరో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు, మోసాలకు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాను నిర్వహిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాదిన్నరగా ఢిల్లీలో ఈ కాల్ సెంటర్ గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అమాయకులను సులభంగా మోసం చేసేందుకు నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణకు చెందిన 25 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళలను టెలికాలర్లుగా రిక్రూట్ చేసుకున్నారు.
జగిత్యాల, కోరుట్లతో పాటు హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ తదితర ప్రాంతాలకు చెందిన యువతులు ఈ కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా బాధితులను బురిడీ కొట్టించేందుకు పక్కా ప్లాన్ అమలు చేసింది. లోన్లు, ఫైనాన్స్ ఇప్పిస్తామని బాధితులకు ఫోన్ చేసి, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మించేవారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు, ఇతర ఇన్స్యూరెన్స్ రుసుముల పేరుతో బాధితుల నుంచి దశలవారీగా పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. డబ్బులు కట్టిన తర్వాత లోన్ ఏమైందని బాధితులు నిలదీస్తే.. వారి వద్ద నుంచి సేకరించిన ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడేవారు.
దేశవ్యాప్తంగా నెట్వర్క్.. అసలు సూత్రధారుల కోసం వేట
ఇలా కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలువురిని టార్గెట్ చేసి కోట్ల రూపాయల సైబర్ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. కాల్ సెంటర్ కార్యకలాపాలు, నిందితుల మధ్య ఉన్న లింకులు, వసూలు చేసిన నగదును ఏ ఖాతాలకు మళ్లించారు అనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అరెస్ట్ చేసిన 22 మందితో పాటు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, ఇతర కీలక నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.